పంట పొలాల్లో సమీకృత సేద్య విధానాలను పాటించేట్లు ప్రోత్సహించడంలో కృషి విజ్ఞాన్ కేంద్రాలు (కెవికే) చేస్తున్న నిర్విరామ కృషి కారణంగా, అధిక దిగుబడులను, సాధించి పెద్దమొత్తంలో ఆదాయం సంపాదించుకోగలుగుతున్నారు. ఆ విధంగా వాటి కృషికి నిదర్శనమా అన్నట్లు లింగ్రాహ వ్యవసాయ క్షేత్రం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.
శ్రీ వల్లమ్ కూపర్ లింగ్రాహ్ ప్రగతిశీల ఆలోచనలతో, వినూత్న ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్న వ్యవసాయదారుడు. ఆయన మేఘాలయ రాష్ట్రంలోని తూర్పుఖాశీ హిల్స్ జిల్లా మవులాయ్ సీ అండ్ ఆర్ డీ తాలూకాలోని మవుసియాక్నన్ గ్రామానికి చెందినవాడు. గ్రాడ్యుయేషన్ విద్యాభ్యాసం పూర్తిచేసి టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆయనకు వ్యవసాయం అంటే ఎనలేని ప్రేమ. అందుకని తన శక్తియుక్తులను అన్నిటినీ ఉత్తమ సేద్య విధానాలను ఆవిష్కరించేందుకే వినియోగిస్తూ వచ్చారు. అందుకు ఆయన తనకున్న2.5 ఎకరాల పొలాన్నే సమీకృత సేద్య క్షేత్రంగా మలుచుకున్నారు.
వ్యవసాయ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్త అవతారం ఎత్తిన తరువాత, సంప్రదాయక సేద్య విధానాల వల్ల దిగుబడులు క్రమంగా తగ్గిపోతాయని, దిగుబడులతో పాటు ఆదాయం కూడా తగ్గిపోతుందని ఆయన గుర్తించారు. సంప్రదాయక సేద్య విధానంలో ఉత్పాదకత తగ్గిపోవడమే కాకుండా సేద్యపు ఖర్చులు మరింత అధిక భారంగా మారిపోతాయని ఆయన గమనించారు. అంతే కాకుండా పంట చేనులో ఉన్న వనరుల వినియోగం చాలా తక్కువగా కొన్ని సందర్భాలలో అసలు ఉండనే ఉండదని కూడా ఆయన అవగాహన చేసుకున్నారు. పర్యావరణపరంగా సమస్యలు తలెత్తుతాయని, ముఖ్యంగా పరిమితంగా పంటలలో వైవిధ్యానికి చోటు ఉంటోందని, ఫలితంగా నేల, నీరు కూడా కలుషితమైపోతున్నాయని ఆయన తెలుసుకున్నారు.
ఆ కారణంగా సుస్థిర సేద్యం దిశగా ఆయన ప్రయాణం ఇలా మొదలయింది. సుస్థిర వ్యవసాయం ఎలా సాధించాలనే ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నంలో ఆయన దృష్టి సుస్థిర వ్యవసాయ విధానాల వైపు మళ్లింది. ఆలోచన వచ్చినదే తడవు, ఆయన 2013లో సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రం అధికారులను సంప్రదించారు. వారి నుంచి సాంకేతిక సలహా సూచనలు తీసుకున్నారు. అందులో సుస్థిర వ్యవసాయానికి సమీకృత సేద్య విధానాలే అనుకూలమని అందుకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానాన్ని ఆయన సమకూర్చుకున్నారు. అదే సమయంలో చేరువలోని ఎన్ఈహెచ్ రీజియన్ కు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చి (మేఘాలయ రాష్టంలోని రి-భోయ్ జిల్లా ఉమయిమ్ పట్టణంలో ఉమ్రాయ్ రోడ్డులో ఉన్నదీ కేంద్రం) కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఆ అనుభవాలు ఆయనకు స్ఫూర్తినిచ్చాయి. అక్కడే సమీకృత సేద్య విధానాల గురించిన అవగాహన, ఆదాయ మార్గాల గురించిన చైతన్యం ఒక రూపు దాల్చాయి. మరింత స్పష్టత కోసం ఆయన అనేక సార్లు కృషి విజ్ఞాన కేంద్రం వారు నిర్వహించిన శిక్షణ శిబిరాలకు హాజరయ్యారు. వర్క్ షాపులు, సెమినార్లలో పాల్గొన్నారు. సాంకేతికపరమైన అన్ని అంశాలను అవగాహన చేసుకున్నారు. అనంతరం, తనకున్న 2.5 ఎకరాల పొలంలో 2015లో ముందుగా కోళ్ల ఫారమ్ ను, పందుల పెంపకం చేపట్టారు. సమీకృ సేద్య విధానాలపై స్పష్టమైన ఆలోచనలు వచ్చిన కారణంగా లింగ్రాహ్ మరో అడుగు ముదుకేసి, తన వ్యవసాయ క్షేత్రంలో మరిన్ని విభాగాలను నెలకొల్పారు.
వాటిలో ముఖ్యమైనవి
2.5 ఎకరాల పొలంలో ఆయన ఏర్పాటుచేసిన విభాగాలు ఇలా ఉన్నాయి.
- తోటల పెంపకం (హార్టికల్చర్)
- పశు సంవర్ధక, పశు పోషణ
- వర్మి కంపోస్టు తయారీ
- తోటల పెంపకం విభాగం
1. తోటల పెంపకం (హార్టికల్చర్)
ఆయన నిర్వహిస్తున్న తోటలో క్యాబేజీ, కాలీఫ్లవర్, మిర్చి, అల్లం, చౌ-చౌ వంటి కూరగాయలు, బొప్పాయి, పైనాపిల్, అస్సాం నిమ్మ, ఆరంజి వంటి పండ్ల రకాలు పండిస్తున్నారు. తూర్పు ఖాశీ హిల్స్ ప్రాంత కృషి విజ్ఞాన్ కేంద్రం వారు ఆయనకు అందుబాటులో ఉన్న కొద్ది పాటి జాగాను పూర్తిగా సద్వినియోగం అయ్యేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందులో భాగంగాఏడాది పొడవునా కూరగాయల సాగును ప్రోత్సహించారు. ఆ రకంగా ఆయన ఆదాయం గణనీయంగా పెరిగింది. అదే సమయంలో భూసారం చాలా మెరుగుపడింది. రకరకాల శిక్షణ కార్యక్రమాలకు హాజరైన తరువాత, పంటల సాగులో కూరగాయలను పండించడం సేద్యంలో వైవిధ్యానికి కారణమవుతుందని, అంతేకాకుండా, ఆహార భద్రత, పోషక విలువల లభ్యతకు భరోసా ఉంటుందని ఆయన గుర్తించారు. ఆయన స్వగ్రామం మవాసియక్నం లో ఏడాది పొడవునా ఆయన పొలంలో కూరగాయల సాగుతూనే ఉంటుంది. మే – అక్టోబర్ మాసాలలో విపరీతంగా వర్షాలు కురుస్తాయి. అందువల్ల నేరుగా పొలంలో రెండో పంట పండిచడం చాలా కష్టసాధ్యమైన విషయం. అయితే పోలీ హౌస్ నిర్మించుకుంటే అలా ఏడాదంతా కూరగాయలను సాగుచేయవచ్చు. అయితే ఆయన స్వయంగా పోలీ హౌస్ నిర్మించుకునే స్థోమత లేని కారణంగా, కృషి విజ్ఞాన్ కేంద్రం వారి సహాయం కోరారు. కృషి విజ్ఞాన్ కంద్రం వారు అగ్రో టెక్స్ టైల్ మంత్రిత్వ శాఖ సాయంతో సింథటిక్ అండ్ ఆర్ట్ మిక్స్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (SASMIRA) సహకారంతో పోలీ హౌస్ నిర్మాణానికి తోడ్పడ్డారు. అందుకు వారు సబ్సిడీ కూడా ఇచ్చారు. ఇప్పుడు, ఏడాది మొత్తం ఆయన కూరగాయలను సాగుచేయగలుగుతున్నారు. ఏడాది పొడవునా నికరమైన ఆదాయం సంపాదించుకోగలుగుతున్నారు.
- పశు సంవర్ధక, పశు పోషణ
ఏ. కోళ్ల పెంపకం
ఆయన తన పొలంలో 2000 వ సంవత్సరంలో 50 కోళ్లతో కోళ్ల పెంపకం ప్రారంభించారు. అయితే అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదని ఆయన గమనించారు. మెల్లిగా ఆయన తన కోళ్ల ఫారమ్ లో కోళ్ల సంఖ్యను రెట్టింపు చేశారు. ఆయన ఎంచుకున్న కోళ్లు రేర్ లేయర్ రకం (BV 360)కావడంతో శాస్త్రీయ పద్ధతిలో కోళ్ల పెంపకం అనేక సమస్యలలో కూరుకుపోయింది. వాటి నుంచి గట్టెక్కడానికి ఆయన కొత్త సాంకేతిక పద్ధతులను అనుసరించేందుకు సిద్ధమయ్యారు. అయినా నష్టాలు తప్పలేదు. మరింత జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, గుడ్లు పెట్టే సమయంలో కోళ్లు షెడ్డులో ఒక మూలకు వెళ్లడం, లేదా నీడ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఎంచుకోవడం వల్లనే సమస్య వస్తోందని ఆయన గుర్తించారు. అది గమనించిన వెంటనే, కోళ్లు గుడ్లు పెట్టేందుకు ఉద్దేశించిన క్యాబిన్ లను ఒక ప్రత్యేక నమూనాలో తయారుచేయించారు. అవి కోళ్లను బాగా ఆకట్టుకోగలిగాయి. దాంతో గుడ్లు పెట్టే దశలో అవి పగిలిపోయే సమస్య జీరో స్థాయికి తగ్గిపోయింది. అక్కడితో ఆయన ఆగకుండా గుడ్ల సేకరణ కోసం తలుపు వంటి సదుపాయం ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ సదుపాయం వల్ల గుల సేకరణకు క్యాబిన్ లోకి ప్రవేశించవలసిన అవసరం లేకుండా పోయింది. ఈ పద్ధతి అనుసరించడం మొదలు పెట్టిన తరువాత, ఆయనఫారమ్ లో గుడ్ల ఉత్పత్తి అధికమైంది. పక్షులు చనిపోవడం కూడా బాగా తగ్గిపోయింది. అందుకు ఆయన అనుసరించిన వినూత్న సాంకేతిక పద్థులే కారణం. గుడ్ల నష్టం 90 శాతం తగ్గిపోయింది. ఉత్పత్తి 80 శాతం నుంచి 90 శాతం వరకు పెరిగిపోయింది. ఆయన అనుసరించిన పద్ధతులు భారీ వ్యయంతో కూడినవి కాకపోవడం, అధిక ఉత్పత్తికి తోడ్పడడం, పక్షుల్లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం వంటి ఫలితాలు ఇచ్చాయి. అందరికీ అందుబాటులో ఉండేవిగా గుర్తింపు పొందాయి.
బి. పందుల పెంపకం
తూర్పు ఖాశీ హిల్స్ పరిసరాలలో పందుల పెంపకం చాలా ఎక్కువగా వాడుకలో ఉన్న పశు పోషణ. దాదాపు 80 శాతం వ్యవసాయ కుటుంబాలు (ప్రతి కుటుంబం కనీసం ఒకటి రెండు పందులను పెంచుతుంటాయి.) పందుల పెంపకం చేపడుతూ ఉంటాయి. స్థానిక బ్రీడ్ నే వారు ఎంపిక చేసుకోవడం సర్వసాధారణం. పైగా ఈ విషయంలో వారికి ఉన్న పరిజ్ఞానం కూడా తక్కువేమీ కాదు. ముఖ్యంగా పందులను బలిష్టంగా, కొవ్వు అధికంగా పెరిగేలా చేయడం వారికి బాగా తెలుసు. అయితే వాటి బ్రీడింగ్ విషయంలో వారికి అంతంత మాత్రమే నైపుణ్యం ఉంటున్నది. వీటిని గమనించిన లింగ్రోహ్ సొంతంగా పందుల బ్రీడింగ్ యూనిట్ నెలకొల్పారు. అందులో 9 ఆడ పందులు, ఒక మగ పంది ఉంటుంది. ఒక ఆడ పంది ఏడాది కాలంలో కనీసం ఒక పంది పిల్లకు జన్మనిస్తుంది. మార్కెట్ పంది మాంసానికి చాలా గిరాకీ ఉంటుంది. అందువల్ల పందుల పెంపకం విస్తరించేందుకు, మెరుగు పరుచుకునేందుకు చాలా అవకాశాలున్నాయి.
సి. గొర్రెల పెంపకం
ఒక యూనిట్ లో 15 గొర్రెలుంటాయి. కంచె కట్టి వాటిని పెంచవలసి ఉంటుంది. వాటి మేతకు ఒక్క పైసా కూడా ఖర్చు కాదు. కంచెను, షెడ్డును చాలా తక్కువ ఖర్చుతోనే నిర్మించుకోవచ్చు. గట్టిగా రూ. 5000 ఖర్చు చేస్తే చాలు. స్థానిక మార్కెట్ లో వాటిని విక్రయించుకోవచ్చు.
డి. చేపల పెంపకం
2018లో ఆయన చేపల పెంపకం కూడా ప్రారంభిచారు. ఒక క్యూబిక్ హెక్టారు స్థలంలో 600 కిలోల ఉత్పత్తికి అనువుగా ఉండే మూడు యూనిట్లను ఏర్పాటుచేశారు. స్థానిక మార్కెట్ లో కిలో చేపల ఖరీదు సగటున రూ. 200 ఉంటోంది. వ్యవసాయంలో పేరుకుపోయే అనుబంధ వ్యర్థ పదార్థాలను ఎరువు గానూ, చేపలకు ఆహారంగాను ఉపయోగించుకుంటున్నారు.
- వర్మి కంపోస్టు యూనిట్లు
ఆయన రెండు వర్మి కంపోస్టు యూనిట్లు నిర్వహిస్తున్నారు. అవి 6 అడుగులు పొడవు, 4 అడుగుల వెడల్పు, రెండు అడుగుల లోతు ఉంటాయి. వాటి ద్వారా, ఏటా 3000 కిలోల వర్మి కంపోస్టు తయారవుతుంది. ఈ మొత్తం ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే ఉపయోగిస్తారు. పొలంలో పోగయ్యే వ్యర్థాలు ఏడాది పొడవునా వర్మీ కంపోస్టు తయారీకి ఉపయోగపడుతుంటాయి.
ప్రభావం
ఈ ఔత్సాహిక రైతు గత మూడేండ్లుగా అనుసరిస్తున్న వినూత్న విధానాలు ఆర్థికంగా మంచి లాభాలు అందిస్తున్నాయి. శ్రీ వాల్లం కె. లింగ్రోహ్ వ్యవసాయ క్షేత్రం ఇప్పుడు అందరికీ ఒక నమూనాగా కనిపిస్తోంది. తోటి గ్రామస్తులు మాత్రమే కాకుండా మొత్తం జిల్లా అంతటి నుంచి అనేక మంది కోళ్ల పెంపకందారులకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నాడు. తక్కువ ఖర్చుతో కోళ్ల పరిశ్రమ షెడ్డు నమూనా అందరికీ ఆచరణీయంగా మారిపోయింది. వారు కూడా
……. టేబుల్ 1 : సమీకృత సేద్య విధానంలో చేపట్టిన వివిధ విభాగాలకు అయిన ఖర్చు – చేతికి అందిన ఆదాయం
విభాగాలు | విస్తీర్ణం/వాటి సంఖ్య | గ్రాస్ ఆదాయం | నెట్ ఆదాయం | వీటి నిష్పత్తి |
తోటల పెంపకం రక్షిత సేద్యం | ||||
(2018 నుంచి) స్క్వేర్ మీటర్లు) | 1/500 | 1,10,000 | 45,583 | మొదటి ఏడాది 0.71 |
నేరుగా సేద్యం | అల్లం | 2,40,00 | 182508 | 3.20 |
పశు సంరక్షణ – పశు పోషణ | ||||
1.కోళ్ల పెంపకం | లేయర్స్ | 8,76,000 | 7,09,140 | 4.25 |
లోకల్ బ్రీడ్ | 18,000 | 8,556 | 2 | |
2. గొర్రెల పెంపకం |
15 నెంబర్లు |
60,000 |
38,000 |
1.73 |
3. పందుల పెంపకం | 1 (9 ఆడ, 1 మగ) |
6,00,000 |
4,31,419 |
2.4 |
4. చేపల పెంపకం అంచనా |
15,000 |
35,000 | 2.3 |
ఇదే పద్ధతిలో కోళ్ల షెడ్డు ఏర్పాటుచేసుకుంటున్నారు. ఈయన నమూనాలోనే జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా అనేక మంది లేయర్ ఫార్మ్ ఏర్పుటుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన పొలంలో ఏర్పాటుచేసిన వివిధ విభాగాల ద్వారా అందుబాటుకు వచ్చిన అన్ని వనరులను సమీకృతం చేసే అంశంపై దృష్టి పెడుతున్నారు. ప్రగతి శీల భావాలున్న వ్యక్తి కావడంతో నిత్యం తన నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచుకునేందుకు, కొత్త కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటాడు. అందువల్ల సమీపంలో ఎక్కడ ఎలాంటి శిక్షణ తరగతులు జరుగుతున్నా హాజరవుతాడు. కనిపించిన ప్రతి నిపుణుడితో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు ఉత్తమ సేద్య విధానాలను పాటిస్తూ అందరికీ మార్గదర్శిగా కనిపించే ఆయన పరిసర ప్రాంతాలలో ప్రభాశీలిగానూ, స్ఫూర్తిదాతగానూ మారిపోయాడు. తూర్పు ఖాశీ హిల్స్ ప్రాంతంలోని ఆవిష్కరణల రైతుల్లో ఆయన ఒకరు. కోళ్ల పరిశ్రమ, పందుల పెంపకం విషయాలలో ఐఎఫ్ఎస్తరఫున జిల్లా అంతటా శిక్షణలు ఇచ్చే బోధకుడి బాధ్యతను కూడా ఆయన నిర్వహిస్తున్నాడు. విజయవంతమైన సమీకృత సేద్య విధానం విస్తృతిలో ఆయన ఆదర్శప్రాయుడిగా నిలిచాడు.
మవసియాక్నన్ కెవికె తూర్పు ఖాశీ హిల్స్ అప్పర్ షిల్లాంగ్ – 793009 మేఘాలయ E-mail: kvkekhup@gmail.com
గమనిక: ఈ వ్యాసం ప్రప్రథమంగా “ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ ఫర్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్ కమ్ ఇన్ ఎన్ఈహెచ్ రీజియన్ ఆఫ్ ఇండియా” లో విద్యుత్ సి. దేకా, ఏ.కే. సింఘా, దివ్యా పారిసా, అజ్రేల్ మెర్విన్ తరియాంగ్, ఎమికా కోర్డార్ క్యిండియా మెసయా ఆర్ మారక్ (ఎడిటర్స్) లు ప్రచురించారు. ఐకార్ – అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, జోన్ VII, ఉమయిమ్, మేఘాలయ – 793103, మార్చి 2020.
ఆంగ్ల మూలం: లీసా ఇండియా, సంపుటి ౨౩, సంచిక 4, డిసెంబర్ ౨౦౨౧